వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: యువతలో ఆరోగ్య చైతన్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. యువజన, క్రీడల వారోత్సవాల్లో భాగంగా కాశిబుగ్గలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వాక్థాన్ కార్యక్రమాన్ని సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ నీరజ, డీబీసీడీఓ పుష్పలత, స్పోర్ట్ అధికారి అనిల్కుమార్, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, ఫిషరీస్ అధికారి శ్రీపతి, డీఎండబ్ల్యూఓ డి.రమేశ్, వివిధ శాఖల అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వాకథాన్ అనంతరం మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు.
గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
న్యూశాయంపేట: జిల్లాలోని గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా జన్ భాగీదారి – సబ్సే దూర్ సబ్సే పహ్లే అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో (ధర్తి ఆబా గ్రామ ఉత్తర్ష్క్ అభియాన్) అమలులో భాగంగా ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాలను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని 8 మండలాలు, 15 గ్రామాలు, హబిటేషన్లలో గిరిజన సంక్షేమ శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో అభియాన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక ఓరియెంటేషన్ అభియాన్ లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళిక, శాఖల బాధ్యతపై అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీటీడీఓ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


