● మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ హరిబాబు
ఖానాపురం : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభిస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు తెలిపారు. మండలంలోని అయోధ్యనగర్, రంగాపురం, ఖానాపురం గ్రామాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నర్సంపేట చైర్మన్ యడ్ల భిక్షంరెడ్డితో కలిసి శాఖమూరి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆత్మ చైర్మన్ భిక్షంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ముఖేశ్, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.
దళారులకు అమ్మితే ఆర్థిక నష్టం
దుగ్గొండి : ధాన్యాన్ని దళారులకు అమ్మితే ఆర్థిక నష్టం వాటిల్లుతుందని మందపల్లి పీఏసీఎస్ చైర్మన్ గుడిపెల్లి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని గిర్నిబావిలో ఆ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. సన్నాలకు ప్రభుత్వం బోనస్ సైతం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ గాజుల శ్యామ్, డీసీఓ సబ్ రిజిస్ట్రార్ సోమశేశర్, వైస్చైర్మన్ సింగతి కార్తీక్, సీఈఓ ఆరెల్లి భిక్షపతి, రంగు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


