దుగ్గొండి : ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శిగా మండలంలోని గిర్నిబావికి చెందిన ముత్యాల స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు బండా ప్రకాశ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా స్వామి మీడియాతో ఆదివారం మాట్లాడారు. ముదిరాజ్ కులస్తుల ఐక్యతకు, అభ్యున్నతికి పాటుపడతామని చెప్పారు. మహాసభ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
యూత్ జిల్లా ఉపాధ్యక్షుడిగా..
సంగెం : ముదిరాజ్ మహాసభ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడుగా మండలంలోని తిమ్మాపూర్కు చెందిన పండుగ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు పొన్నం మొగిలి ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా రాజు మీడియాతో మాట్లాడారు. ముదిరాజ్ కులస్తుల ఉన్నతికి కృషి చేస్తానన్నారు. యువతను చైతన్యవంతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం, నాయకులు చొప్పరి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి చేయూత
ఖానాపురం : మండలంలోని బుధరావుపేటలో హనుమాన్ ఆలయ నిర్మాణం కోసం ఆలయ కమిటీకి కొండ్లె మధు, మలిశెట్టి కోటి, మలిశెట్టి విక్రమ్, సుదగాని సుధాకర్ రూ.32 వేల నగదుతోపాటు 50 సిమెంట్ బస్తాలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ బాధ్యులు సన్మానించారు. ఆలయ నిర్మాణానికి చేయూత అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
జీపీకి ఫ్రీజర్ అందజేత
సంగెం : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీకి స్థానికులు అనుమాస ఉమాదేవి శ్రీధర్ దంపతులు ఆదివారం మృతదేహాలను భద్రపర్చేందుకు ఉపయోగించే ఫ్రీజర్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. అనుమాస శేఖరయ్య జ్ఞాపకార్ధం రూ.60 వేలు వెచ్చించి ఫ్రీజర్ కొనుగోలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా గ్రామ పంచాయతీకి అప్పగించినట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పేర్ల లలిత, ఉపసర్పంచ్ ఆగపాటి రాజు, వార్డు సభ్యుడు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
టాపర్లకు సన్మానం
ఐనవోలు : పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన ఇంటిమామిడిపల్లి స్కూల్ విద్యార్థులు నందిని, వరుణ్ సందేశ్, మేఘనలను కలెక్టర్ కార్యాలయంలో డీఈఓ గిరిరాజ్ సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం శివకుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మోహన్, పీఈటీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


