● వ్యవసాయ శాస్త్రవేత్తలు రాములు, పద్మజ
రాయపర్తి : వరి సాగులో డిమాండ్ ఉన్న రకాల ఎంపిక కీలకమని వ్యవసాయ శాస్త్రవేత్తలు రాములు, పద్మజ స్పష్టం చేశారు. మండలంలోని గట్టికల్లో బుధవారం నిర్వహించిన అవగాహనా సదస్సులో వారు మాట్లాడారు. మార్కెట్లో డబ్ల్యూజీఎల్ 962, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 1638 వంటి రకాలకు విదేశాల్లోనూ డిమాండ్ ఉందన్నారు. ఈ రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే బోనస్ సైతం పొందవచ్చని చెప్పారు. వరి సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలని చెప్పారు. వరి సాగు అనంతరం పెసర్లు, బొబ్బెర్లు, మినుములు వేసుకుంటే మేలన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని తెలిపారు. అనంతరం పంటల సాగు సూచనలకు సంబంధించిన బ్రోచర్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెవ్వు హేమలత కాశీనాథం, ఉపసర్పంచ్ చిర్ర నాగరాజు, ఏఓ గుమ్మడి వీరభద్రం, ఏఈఓ క్రాంతికుమార్, పంచాయతీ కార్యదర్శి సుమలత, తదితరులు పాల్గొన్నారు.


