
ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి
న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి ఆదేశించారు. వరంగల్ డివిజన్లో ధాన్యం కొనుగోలుపై సన్నాహక, శిక్షణా కార్యక్రమాన్ని హనుమకొండ డీసీసీబీ భవన్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వానాకాలం 2025 –26కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పక్కాగా చేపట్టాలన్నారు. కేంద్రాలను లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయొద్దని, కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. అవసరమైన గన్నీ సంచులు, టార్పలిన్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.
పశుసంపదను కాపాడుకోవాలి
రాయపర్తి: పశువులు రోగాలబారిన పడకుండా కాపాడుకుంటూ పశుసంపదను పెంచుకోవాలని రైతులకు వరంగల్ జిల్లా డీవీఏహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ సూచించారు. మండలంలోని మైలారం గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల బారినుంచి పశువులను కాపాడుకునేందుకు ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ శ్రుతి, మక్బుల్, జేవీఓ వెంకటయ్య, ఎల్ఎస్ఏ గణేష్, వీఏ.కపిల్, గోపాల మిత్రలు రమేష్, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఆర్డీఎఫ్ విద్యార్థిని
పర్వతగిరి: వరంగల్ జిల్లా పరిధిలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్ –19 బాలికల వాలీబాల్ ఎంపికలో మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ వనితా అచ్యుతా పాయి విద్యాలయ జూనియర్ కళాశాల విద్యార్థిని జి.వెన్నెల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన పోటీల్లో జి.మహేశ్వరి, జి.కళ్యాణి, జి.వెన్నెల, ఎం.శిరీష, యశస్విని, ఎం.అమృత, పి.సౌమ్య పాల్గొనగా జి.వెన్నెల అద్భుత ప్రతిభ కనబర్చి మూడో స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్ధన్, ఉపాధ్యాయులు అభినందించారు. అకడమిక్ హెడ్ ప్రవీణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఏఓ సతీష్, అధ్యాపకులు మహేశ్వర్, జయశంకర్, సంతోష్కుమార్, శ్రీధర్, ధన్య, పీటీ కోకిల, సైదులు, గుంశావళి, తిరుమల, ధనలక్ష్మి పాల్గొన్నారు.
ఆత్మరక్షణకు కరాటే దోహదం
నెక్కొండ: విద్యతోపాటు ఆత్మరక్షణ కోసం కరాటేలోనూ విద్యార్థినులు రాణించాలని టీజీ రెసిడెన్సియల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి సూచించారు. కరాటేలో ప్రతిభ చాటిన వారిని పాఠశాలలో గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 16న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 69వ ఎస్జీఎఫ్ కరాటే పోటీలు ములుగు జిల్లాలో జరగగా, తమ విద్యార్థులు 16 మంది వివిధ విభాగాల్లో పాల్గొన్నారని తెలిపారు. కరాటే అండర్ –17లో విభాగంలో టి.శ్రీలక్ష్మి ప్రథమ స్థానంలో నిలవగా, మరో ఏడుగురు విద్యార్థులు ద్వితీయ, ఇంకో ఐదుగురు విద్యార్థులు తృతీయ స్థానాల్లో నిలిచారని ప్రిన్సిపాల్ వివరించారు. కార్యక్రమంలో పీఈటీ కమల కుమారి, కరాటే మాస్టర్ రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి

ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి