
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
వరంగల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో బుధవారం 69వ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొని జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని, ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తుందని వివరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఖోఖో తదితర పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, డీపీఆర్వో అయూబ్అలీ, జిల్లా యువజన, క్రీడల అధికారి సత్యవాణి, జీసీడీఓ ఫ్లోరెన్స్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి సోనబోయిన సారంగపాణి, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జలగం రఘువీర్, కోశాధికారి వెంకటేశం, రిటైర్డ్ పీఈటీ చెన్నబోయిన రామదాసు, పీజీ హెచ్ఎం రాజుబోయిన భిక్షపతి, హనుమకొండ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి కుమార్, అండర్–19 ఎస్జీఎఫ్ సెక్రటరీ నరెడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
నర్సంపేట: భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్లోని ఆరు మండలాల తహసీల్దార్లు, ఇతర సిబ్బందిలో భూ భారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రవిచంద్రరెడ్డి, రాజేశ్వరరావు, రాజ్కుమార్, అబిద్అలీ, రమేశ్, కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
నర్సంపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు, ఆలస్యం లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని, భద్రతాపరంగా పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. లక్నెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూడు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఓ సిటీలో జిల్లాస్థాయి పాఠశాల క్రీడలు ప్రారంభం