
మహాజాతరకు 112 రోజులే..
వనదేవతల ప్రాంగణ విస్తరణకు కసరత్తు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ఇంకా 112 రోజులే సమయం మిగిలి ఉంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మహాజాతర జరుగనుంది. ఈ సారి జాతరకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతో వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్రెడ్డి మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఇటీవల ఆవిష్కరించిన విషయం విదితమే. అప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణం సాలహారం (ప్రహరీ) నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.
సాలహారం నిర్మాణానికి మార్కింగ్
సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ ఇంజనీరింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. సారలమ్మ ఆర్చి ఎగ్జిట్ గేట్ ప్రహరీ నిర్మాణానికి బయట స్థలాన్ని చదును చేశారు. ప్రహరీ నిర్మాణంతో పాటు మీడియా వాచ్ టవర్ల నిర్మాణానికి కూడా మార్కింగ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకర, రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ శాఖ ఇన్చీఫ్ మోహన్నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ ఓంప్రకాశ్, ఆర్కిటెక్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేడారం గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న పనులను పరిశీలించారు. అమ్మవార్ల దర్శనానికి పోలీస్ కమాండ్ కంట్రోల్ క్యూలైన్ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులు గద్దెల ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్టాండ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. ప్రహరీ పనుల మార్కింగ్ను కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చేయాల్సిన పనులపై సూచనలు చేశారు. సాలహారంతో పాటు ఎనిమిది ఆర్చీ ద్వారాల నిర్మాణాలతో పాటు అదనంగా మరో ఆర్చీ ద్వారం నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ మ్యాప్లను చూపిస్తూ పనుల వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ పనుల్లో ఎక్కడ కూడా సంస్కృతి, సంప్రదాయాల్లో తేడా రాకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓ వీరస్వామి, డీఈ రమేశ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు.
పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నం
సమీపిస్తున్న జాతర సమయం

మహాజాతరకు 112 రోజులే..