
సుగంధాల సిరులు
● తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి
● వరంగల్ జిల్లాలో 133 ఎకరాలు
● హనుమకొండ జిల్లాలో
172 ఎకరాల్లో సాగు
హన్మకొండ: తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు అర్జించాలన్నా.. కొంత పెట్టుబడితో అధిక రాబడిని సాధించాలన్నా.. పూల తోటల సాగు బెటర్ అని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తుండడం, అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఇప్పుడిప్పుడే పూల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా పూల తోటల సాగు నిలుస్తోంది. సీజన్కు అనుగుణంగా పంట చేతికొచ్చేలా సాగు చేస్తే అధిక లాభాలు అర్జించవచ్చు, పెళ్లిలు, శుభకార్యాలు, ప్రధాన పండుగలకు పంట చేతికి వచ్చేలా సాగు చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం 172 ఎకరాల్లో, వరంగల్ జిల్లాలో 133 ఎకరాల్లో పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తూ పూల తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యాన పంటల అభివృద్ది మిషన్ ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది. విడి పూలు (మంతి, చామంతి, కనకాంబరం, మల్లె), సాగుకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా 40 శాతం రాయితీని అందిస్తోంది. ఎకరానికి రూ.8 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీని పొందవచ్చు. దుంపజాతి పూల సాగు (గ్లాడియోలస్, లిల్లీ)కి 40 శాతం రాయితీ వస్తుంది. దుంప జాతి బహు వార్షిక పూలు అయిన గ్లాడియలస్, లిల్లీ, డైస్, జర్బేర వంటి సాగుకు ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.40 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో బంతి పూల తోటను పరిశీలిస్తున్న ఉద్యాన అధికారి