
ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ..
ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు
ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు.
పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం
వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు.
అవగాహనే కొండంత అండ..
అనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం
ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం.
– రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర

వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు

రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు