
స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తాం..
వరంగల్ అర్బన్: స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తామని నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. బల్దియా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్(వీధి ఆహార విక్రయాదారుల వంట కళల ప్రదర్శన, అమ్మకం) కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాలు, వర్షం కారణంగా 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8.30 గంటలకు ముగిసింది. ఈసందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ట్రీట్ వెండర్స్ గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకు రుణాలను ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద వర్గాలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈసందర్భంగా 30 స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా.. శుచి, శుభ్రత బాగుందని హాజరైన నగర ప్రజలు, అతిథులు అభినందించారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మెప్మా స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసూనరాణి, రవీందర్, రాజేశ్వర్రావు, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం
ఫుడ్ ఫెస్టివల్లో మేయర్, ఎమ్మెల్యే