నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’

Jun 30 2025 7:36 AM | Updated on Jun 30 2025 7:36 AM

నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’

నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’

హన్మకొండ: మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రయాణికుల నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్‌ యువర్‌ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్‌ భూక్యా ధరంసింగ్‌ తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్‌, హనుమకొండ, హసన్‌పర్తి, కమలాపూర్‌, వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 8977781103 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు వివరించడంతో పాటు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు.

డాక్టర్‌ వేణుకు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు

గీసుకొండ: గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన హైదరాబాద్‌ ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (జనరల్‌ సర్జన్‌) డాక్టర్‌ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్‌ ఇంటర్నేషనల్‌ కల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్‌ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్‌ ఎంజీఎం, ఆదిలాబాద్‌, వరంగల్‌లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

టీచర్లకు బదిలీలు,

పదోన్నతులు చేపట్టాలి

విద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.రవీందర్‌రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్‌, జ్యోతి, కార్యదర్శులు సీఎస్‌ఆర్‌.మల్లిక్‌, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్‌, కె.శశిధర్‌రెడ్డి, ఆడి ట్‌ కమిటీ కన్వీనర్‌ జి.భాస్కర్‌రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవా రం గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమి షనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగర ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దుచేయాలి

రామన్నపేట: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని గుమస్తాల సంఘం కార్యదర్శి గున్నాల ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సీఐటీయూ నాయకులతో కలిసి వరంగల్‌లోని వ్యాపారులకు ఆదివారం సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కులకు ఈ నాలుగు లేబర్‌ కోడ్‌ల వల్ల అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదాని, అంబానీలాంటి కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. కార్మికులు సమ్మెలో పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్‌, సహాయ కార్యదర్శి సింగారపు బాబు, జిల్లా కమిటీ సభ్యులు అప్పాజీ వాణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement