నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఆదాయంపై అధికారులు దృష్టి సారించడం లేదు. కొందరు లీజు అగ్రిమెంట్ చేసుకొని వాటిని సబ్ లీజుకు ఇస్తూ అక్రమ మార్గంలో నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ లేదా టెండర్లో తక్కువ ధరకే దక్కించుకుంటున్నారు. షాపింగ్ సముదాయాల ద్వారా వస్తున్న ఆదాయం కంటే వాటిని లీజుకు పొందిన వారు ఇతరులకు వాటిని అద్దెకు ఇచ్చి మరింత సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగ వేలం వేస్తే మున్సిపాలిటీకి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
బినామీల హవా!
ఆదాయాన్ని సమకూర్చే మున్సిపాలిటీకి 94 దుకాణ సముదాయాలు ఉన్నాయి. ఇందులో 10 నుంచి 15 వరకు బినామీలతో నడుస్తున్నాయి. మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న 33 సముదాయాలతోపాటు నెహ్రూ సెంటర్లో 30, సెంట్రల్ బ్యాంకు కాంప్లెక్స్లో మరికొన్ని దుకాణ సముదాయాలకు మార్కెట్ పరంగా చూస్తే అత్యధిక డిమాండ్ ఉంది. కానీ, కొన్నేళ్లుగా రెన్యువల్ చేస్తూ వస్తుండడంతో బయటి అద్దెలకంటే తక్కువ స్థాయిలో మున్సిపాలిటీకి చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి 33 శాతం అద్దె పెంచాల్సి ఉంది. దానికి అనుగుణంగా అద్దె పెరుగుతూ వస్తుంది. 25 సంవత్సరాలు మాత్రమే ఈ విధంగా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అద్దెకు తీసుకున్న వ్యక్తులు బినామీకి ఇచ్చుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
నిబంధనలు గాలికి..
లీజుకు తీసుకున్న వారే దుకాణ సముదాయాలను ఉపయోగించుకోవాలి. సబ్ లీజు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించకూడదు. ప్రతీ సంవత్సరం రూ.80 లక్షల ఆదాయం వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ లీజు వ్యవహారంలో అధికారులు చూసీచూడనట్లు ఉండడం వల్ల మున్సిపాలిటీకి నష్టం వాటిల్లుతోంది. క్షేత్రస్థాయిలో లీజు ఒప్పందాలకు విరుద్ధంగా ఇతరులు నిర్వహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
బహిరంగ వేలం నిర్వహిస్తాం..
మున్సిపాలిటీలో దుకాణ సముదాయాలకు ప్రతీ మూడేళ్లకు ఒకసారి లీజు అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుంది. త్వరలో నెహ్రూ సెంటర్, గర్ల్స్ హై స్కూల్ ఏరియాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లకు నిబంధనల ప్రకారం 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి బహిరంగ వేలం నిర్వహిస్తాం. లీజు పొందిన వ్యక్తులు సబ్ లీజుకు ఇస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– భాస్కర్, మున్సిపల్ కమిషనర్
ఆదాయంపై దృష్టి సారించని అధికారులు