
భూ సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
వర్ధన్నపేట: రైతుల భూ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన గొప్ప చట్టం భూ భారతి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా వర్ధన్నపేట మండలాన్ని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా సోమవారం బండౌతపురం, కొత్తపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్లను పరిశీలించి అధికారులకు వారు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది పేద రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, ప్రస్తుతం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో భూసమస్యలు లేని మండలంగా వర్ధన్నపేటను తీర్చిదిద్దాలని అధికా రులను ఆదేశించారు. ఈనెల 14వ తేదీ వరకు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రెండు బృందాల ద్వారా సదస్సుల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సదస్సుల అనంతరం నెలలోపు భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కరిస్తామని ఆమె వివరించారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. బండౌతపురంలో 68, కొత్తపల్లిలో 81 దరఖాస్తులువ వచ్చినట్లు అధికారులు తెలిపారు. సదస్సులో డీఆర్ఓ విజలక్ష్మి, తహసీల్దార్ విజయసాగర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే
కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద
బండౌతపురం, కొత్తపల్లి
గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు