
మహిళల ఆర్థికాభివృద్ధికి డెయిరీ ఏర్పాటు
హన్మకొండ అర్బన్ : పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పాడి డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ‘మహాజన సభ ’నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పప్పుడు ఈ విషయాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రారంభంనుంచి కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. మహిళలు ఐకమత్యంగా ఉండి అనేక రంగాల్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. మహిళలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ముల్కనూరు మహిళా డెయిరీ వారి శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముల్కనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. డెయిరీ విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎన్డీడీ) సహకారంతోపాటు అధికారులు అండగా ఉంటారని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డెయిరీ నిర్వహణకు మహిళలు శిక్షణ పొందాలన్నారు. నిర్వహణలో ప్రారంభంలో కొంత కష్టం ఉంటుందని, హార్డ్ వర్క్ చేసి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలను డెయిరీ సంబంధిత యూనిట్లకు ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు పాల ఉత్పత్తి రంగానికి అనుబంధంగా ఉన్న వాటిని ఎంచుకోవాలన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ప్రత్యేక విజన్తో మహిళలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
వివిధ అంశాలపై అధికారులతో
ఎమ్మెల్యే సమావేశం
‘మహాజన సభ ’ సమావేశం అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, నేచురల్ ఫార్మింగ్పై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి–హబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ దామెర మండలం ల్యాదెల్లలో ఏర్పాటు చేస్తున్న మహిళా నైపుణ్యాభివద్ధి శిక్షణ కేంద్రం జూన్ నెలలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ కోసం జిల్లాలో 10 మండలాల్లోని పది గ్రామాలను ఎంపికయ్యాయని, ఈ గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయంలో సాగే విధంగా సహకార శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన భవన నిర్మాణం, వసతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వివరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రవీందర్ సింగ్, అనురాధ, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, ఇతర అధికారులతోపాటు పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి
డెయిరీని విజయవంతంగా
నిర్వహించాలి: కలెక్టర్లు ప్రావీణ్య,
సత్యశారద