
లో లెవెల్.. హై రిస్క్!
నర్సంపేట: వర్షాకాలం వచ్చిందంటే భారీ వరదలతో ఆ రహదారి బ్లాక్ అవుతుంది. వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం, భద్రాచలం, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు రాకపోకలు బంద్ అవుతాయి. చిన్న సమస్య పరిష్కారం చేయడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి వాహనదారులు, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో సమస్య ఎప్పటిలాగే పునరావృతం కానుంది.
ప్రయాణం.. ప్రమాదకరం
నర్సంపేట నెక్కొండకు చెన్నారావుపేట మీదుగా వెళ్లే ప్రధాన రహదారిలో పాత మగ్ధుంపురం గ్రామ సమీపంలో ఉన్న లో లెవల్ కాజ్వే మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కాజ్వేకు ఇరువైపులా ఉన్న రక్షణ దిమ్మెలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా లో లెవల్ కాజ్వేకు బుంగ పడింది. ఆర్అండ్బీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. అయినా ఈ లోలెవల్ కాజ్వే శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరహదారి మీదుగా వెళ్లాలంటే కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతంగా ప్రవహించడంతో కాజ్వేపై నుంచి నర్సంపేట–నెక్కొండకు రాకపోకలు నిలిచిపోతాయి.
ఇప్పటి వరకు జరిగిన ఘటనలు..
● కాజ్వే పై నుంచి వర్షాకాలంలో ప్రవహిస్తున్న నీటిని దాటి వెళ్తూ ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు.
● ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా స్థానికులు చూసి కాపాడారు.
● గతేడాది వర్షాకాలంలో గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆమెను ప్రవాహం నుంచి దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
● మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి రాత్రి వేళ వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోలెవెల్ కాజ్వే కింద పడిపోయి ఇప్పటి వరకు అచేతన స్థితిలో మంచానపడి ఉన్నాడు. ఇలా.. ప్రతీ వర్షాకాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు, సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
లో లెవల్ కాజ్వేపై బ్రిడ్జి నిర్మాణమెప్పుడో?
వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్
శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ప్రధాన రహదారిలోని కాజ్వే
విరిగిన రక్షణ దిమ్మెలు
భయాందోళనలో ప్రయాణికులు,
వాహనదారులు
నూతన బ్రిడ్జి నిర్మించాలని వేడుకోలు...

లో లెవెల్.. హై రిస్క్!

లో లెవెల్.. హై రిస్క్!