
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ధర్మసాగర్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబా టులో ఉంచాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్ కుమార్ సూచించారు. వ్యవసాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని వివిధ విత్తన షాపుల్లో వ్యవసాయ అధికారులు, పోలీసులు కలిసి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు షాపుల్లోని విత్తన స్టాక్ రిజిస్టర్లు, విత్తన నిల్వలు, బిల్లులు, స్టోర్స్, సర్టిఫికెట్లు, గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆధీకృత డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై జానీపాషా, వ్యవసాయ అధికారులు సంతోష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.