
సన్నబియ్యం పంపిణీ చేయాలి
ధర్మసాగర్ : రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం మండలంలోని ముప్పారంలో రేషన్ షాపును అధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 17వ నంబర్ షాపులో ఎన్ని క్వింటాళ్ల బియ్యం వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు.. ఏయే సమయంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు. కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయి..కుటుంబ సభ్యుల చేర్పుల కార్డులు ఉన్నాయా అని డీలర్ను అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యంను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం తీసుకున్నారు.. సన్నబియ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించి, రెవెన్యూ సదస్సు సందర్భంగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన వివిధ సహాయక కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాతంపల్లి గ్రామ పరిధిలోని సయ్యద్నగర్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా వాటిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపు తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి కొమురయ్య, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, డీఈ సిద్దార్థ నాయక్, నాయబ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
భూ భారతి రెవెన్యూ సదస్సు పరిశీలన