
సీడ్.. ఫ్రాడ్
రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తి
జిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా
జిల్లా సాగు అంచనా అవసరమయ్యే
(ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు
హనుమకొండ 85,000 1,70,000
వరంగల్ 1,22,358 2,44,716
మహబూబాబాద్ 84,070 1,68,140
భూపాలపల్లి 1,01,500 2,03,000
జనగామ 1,45,000 2,90,000
ములుగు 29,430 58,860
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ.
వరి తర్వాత పత్తివైపే రైతుల మొగ్గు..
ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా, 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈ సారి బీటీ–3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలులో సతమతమవుతున్నారు.
బ్లాక్ మార్కెట్లో విత్తనాలు..
రూ.400 వరకు అదనం..
ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆ మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఓవైపు నకిలీ బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకె ట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 ర కాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా బీటీ–2 ర కాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901కు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350 నుంచి రూ.1,450 వరకు అమ్ముతున్న ట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సీజన్ ఆరంభం నుంచే దందా
పత్తి విత్తనాల కృత్రిమ కొరత...
తప్పని అధిక ధరల మోత
పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ..
ఇటీవల పట్టుకున్న పోలీసులు
నిఘా పెంచాలని కోరుతున్న రైతులు