
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
నర్సంపేట: రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందకు రావాలని, తద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నర్సంపేటలో బుధవారం ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతుల సౌకర్యార్థం ఆయిల్ పామ్ కంపెనీ తరఫున కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సాగు చేసిన ఆయిల్ పామ్ సాగు ఆరు వేల ఎకరాల వరకు ఉందన్నారు. రైతులు ఇంకా ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. మార్కెట్, దళారులు, కోతలు, ధరల సమస్య లేనటువంటి పంట ఆయిల్ పామ్ అని అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని, రైతులు పెద్ద ఎత్తున సాగు చేయాలని కోరారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్ పామ్ పండించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందిన రైతులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. అనంతరం గెలలు కొనుగోలు చేసిన తర్వాత రైతుకు చెక్కు రూపంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం డబ్బులు చెల్లించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, రామ్చరణ్, ఆయిల్ ఇండస్ట్రీస్ జీఎం నారాయణ, డీహెచ్ఎస్ఓ అనసూయ, ఉద్యాన అధికారులు జ్యోతి, తిరుపతి, రాకేష్, ఆర్డీఓ ఉమారాణి, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి