
‘ఆయుష్మాన్’లో నాణ్యమైన వైద్యసేవలు
● డీఎంహెచ్ఓ అప్పయ్య
ఎల్కతుర్తి : ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య తెలిపారు. మండలంలోని కేశవాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఎల్కతుర్తి పీహెచ్సీని డీఎంహెచ్ఓ గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల విశ్వసనీయత, సౌకర్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నాణ్యత, హామీ ప్రమాణాలు (ఎన్క్యూఎస్) ప్రారంభించిందన్నారు. గతేడాది నుంచి జాతీయస్థాయిలో అవార్డు కోసం ఎల్కతుర్తి ప్రాథమిక ఆర్యోకేంద్రం పరిధిలోని కేశవాపూర్ ఆయుష్మాన్ హెల్త్ ఆండ్ వెల్నెస్ సెంటర్ పోటీ పడుతోందన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి శ్రీనాథ్, డాక్టర్ అరవింద్, దుర్గాప్రసాద్, కవిత, భవాని, రుక్మొద్దిన్, రవీందర్, ఉమాదేవి, ఏఎన్ఎంలు శుక్ర, స్వరూప, సునీత, రాజ్కుమార్ తదితరులు ఉన్నారు.
పీహెచ్సీలను శుభ్రంగా ఉంచాలి
ఎంజీఎం/హసన్పర్తి : జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంతో పాటు లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రాంగణం శుభ్రంగా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించాలని సూచించారు. అదేవిధంగా టీబీ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్ఓ పిలుపునిచ్చారు. హసన్పర్తి మండల కేంద్రంలోని దళితవాడ పాఠశాలలో టీబీ టెస్ట్లు నిర్వహించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజాహైదర్, హెల్త్ సూపర్వైజర్ బాబు, ఎంజీఎం సూపర్వైజర్ నర్మద, విప్లవకుమార్, టీబీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు, టెక్నీషియన్ అయ్యుతరావు,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫార్మసీ ఆఫీసర్, నర్సింగ్ అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.