
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఎల్కతుర్తి: రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని కేవీకే ప్రధాన శాస్త్రవేత డాక్టర్ శ్రీధర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖరీఫ్కు సంబంధించి వ్యవసాయం, పాడి పశువులపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి చర్చించి వాటిని వినియోగించుకోవాలని కోరారు. రైతులు ఒక పంటకు బదులు వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా నేలసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు వివిధ రకాల నూనె గింజల పంటలు ఆముదం, నువ్వులు, కుసుమ, పప్పు దినుసులు వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సస్యరక్షణకు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రిక రకాలను వినియోగించడం ద్వారా నాణ్యమైన దిగుబడి సాధించవచ్చన్నారు. పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ సాయికిరణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న పథకాలను రైతులకు వివరించారు. రైతులు అడిగిన సమస్యలకు శాస్త్రవేత్తల బృందం సలహాలు, సూచనలు అందించింది. అనంతరం మండలంలో సాగు చేసిన ఆయిల్ ఫాం తోటలను సందర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఇండోరియా, సాయిచంద్, ఏఓ రాజ్కుమార్, ఏఈఓలు పూర్ణచందర్, బాబు తదితర రైతులు పాల్గొన్నారు.
ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్