
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి..
హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని గృహ నిర్మాణ సంస్థ హనుమకొండ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ధరావత్ రవీందర్ సూచించారు. రెండు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయని, జిల్లాలోని లబ్ధిదా రులు 9వ తేదీలోపు ముగ్గులు పోసుకుని పనులు ప్రారంభించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. లబ్ధిదారులు సామూహికంగా ముగ్గులు పోసుకోవాలని ఈమేరకు కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన వివరించారు.
రుణం పేరిట వేధింపులు
కాజీపేట: కాజీపేట పట్టణంలోని కొంతమందికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి రుణం చెల్లించాలని బెదిరిస్తున్నారు. రుణ యాప్లో లోన్ తీసుకున్న వ్యక్తికి మీరు వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారని.. తిరిగి చెల్లించాలంటూ బెదిరిస్తున్నారు. ‘దాదారి శశిధర్ అనే యువకుడు ఐడీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. దానికి మీరు షూరిటీ పెట్టినందున లోన్ మొత్తం కట్టాలి’ అంటూ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గబ్బెట శ్రీనివాస్తో పాటు మరో ఇద్దరికి వరుసగా 81849–56121 నంబరు నుంచి ఫోన్లు వస్తున్నాయి. తాము ఎవరికీ షూరిటీ పడలేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కాల్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసిన వ్యక్తులు తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఎదుటి వారు చెప్పింది కూడా వినకుండా ఇష్టారితీన మాట్లాడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితులంతా శశిధర్ ఇంటికి వెళ్లగా.. తనకు ఎవరూ తెలియదని, ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగం కావొచ్చని శశిధర్ వాపోయాడు. అందరూ కలిసి శనివారం కాజీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి తమను గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. ఘ టనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇంటింటి సర్వేలో టీచర్లు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా.. రెండో రోజు శనివారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అలాగే.. ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు తమ పాఠశాల గ్రామ పరిధిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. బడీడు పిల్లల వివరాలు సేకరిస్తున్నారు. వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించేలా తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అర్ధంతరంగా బడి మానేసిన విద్యార్థులుంటే వారి వివరాలు సేకరించి ఓపెన్ స్కూల్లో నమోదు చేయించాలని సూచిస్తున్నారు. జిల్లాలో 372 పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఇంటింటి సర్వేలో భాగస్వాములైనట్లు జిల్లా విద్యాశాఖ కమ్యునిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో బడిబాట కా ర్యక్రమంలో భాగంగా.. ఇంటింటి ప్రచారం, సర్వే నిర్వహించారు.
‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులను
వినియోగించుకోవాలి..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను వినియోగించుకోవాలని సెల్ట్ (సెంటర్ ఫర్ లాంగ్వేజ్ ఫర్ ఇంగ్లిష్ టీచింగ్) డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. సెల్ట్ ఆధ్వర్యంలో ఆరువారాల స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై విశ్వవిద్యాలయంలోని ఇంగ్లిష్ విభాగంలో తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, గృహిణులు, బోధన, బోధనేతర ఉద్యోగులు ఈనెల 14 తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులకు ఫీజు రూ.1,000, బయటివారికి రూ.1,500 ఉంటుందని, ఫీజును యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాన్ యూనివర్సిటీ ఫండ్ ఖాతాలో చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వారు వినియోగించుకోవాలని కోరారు.
ఐలోని మల్లన్నకు
వరంగల్ కలెక్టర్ పూజలు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామిని వరంగల్ కలెక్టర్ సత్యశారద దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ సత్యశారద దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.