
సన్నాలకు బోనస్ ఏది?
కమలాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లింపులు జరగడం లేదు. యాసంగి సీజన్కు సంబంధించిన సన్నరకం బోనస్ జిల్లాలోని ఏ ఒక్క రైతుకూ అందలేదు. యాసంగి సీజన్ ముగిసి వానాకాలం సాగు ప్రారంభమవుతున్నప్పటికీ సన్నవడ్లకు బోనస్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా బోనస్ వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
బోనస్ విలువ రూ.10.57 కోట్లు..
యాసంగి పంటల సాగుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈక్రమంలో సన్నరకం వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 76 కొనుగోలు కేంద్రాలు, డీఆర్డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో 70 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 151 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,031 మంది రైతుల నుంచి 21,153 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.10,57,65,000 బోనస్ చెల్లించాల్సి ఉంది. కానీ యాసంగి పంట కొనుగోళ్లు దాదాపు పూర్తయి వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో సన్నవడ్ల బోనస్ డబ్బులు మాత్రం జమకాలేదు.
బోనస్ ఇంకా జమకాలే..
రెండున్నర ఎకరాల్లో నేను సన్నరకం వడ్లు సాగు చేసిన. ఈనెల 9వ తేదీన కొనుగోలు కేంద్రంలో అమ్మగా, కటింగ్లు పోను 50.80 క్వింటాళ్ల లెక్కకొచ్చింది. సన్నాలకు ఇప్పటిదాకా బోనస్ పైసలు మాత్రం జమకాలే. ఇప్పటికే వానాకాలం పనులు ప్రారంభమయ్యాయి. వెంటనే బోనస్ డబ్బులు చెల్లించాలి.
– పింగిలి జయపాల్రెడ్డి, కమలాపూర్
నెలదాటిన బోనస్ రాలే..
నేను ఆరెకరాల్లో సన్న వడ్లు సాగు చేసిన. నాలుగెకరాల్లో 120 క్వింటాళ్ల సన్న వడ్లు పండగా గూడూరు సొసైటీ కొనుగోలు కేంద్రంలో అమ్మిన. వడ్ల పైసలు వచ్చినయి, కానీ నెల రోజులైనా బోనస్ పైసలు మాత్రం జమ కాలేదు. వానాకాలం పనులకు ముందే నాకు రావాల్సిన రూ.60 వేల బోనస్ డబ్బులు ప్రభుత్వం వెంటనే ఇయ్యాలి.
– మామిడిశెట్టి తాతారావు, గూడూరు
సీజన్ ముగిసినా.. జమకాని డబ్బులు
అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు
బోనస్ వెంటనే చెల్లించాలని
రైతుల వేడుకోలు

సన్నాలకు బోనస్ ఏది?

సన్నాలకు బోనస్ ఏది?