
పిల్లలను ప్రభుత్వ బడికి పంపండి
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. 2025–26విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో కొద్దిరోజులుగా అనేక చోట్ల ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే తమ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్య అందిస్తామని కరపత్రాలు, బ్రోచర్లు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్న తల్లిదండ్రులను, ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకే వెళ్లి ప్రభుత్వ బడిలో అందించే సౌకర్యాలపై టీచర్లు అవగాహన కల్పించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వివిధ తరగతుల్లో చేర్పించేందుకు 1,908 మంది విద్యార్థులను గుర్తించారు.
మౌలిక సదుపాయాలపై అవగాహన
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఏఐ కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కూడా అందిస్తున్నామని ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ హైస్కూల్స్ పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా, అందులో ప్రత్యేక నిధులతో గ్రంథాలయాలు, ఆట వస్తువులు, ఇతర సదుపాయాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలాగే బడిఈడు పిల్లలను సైతం గుర్తిస్తున్నారు. బడిమానేసిన పిల్లలు ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది. జూన్ 6వ తేదీనుంచి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు.
తల్లిదండ్రులతోనూ సమావేశాలు
ఈనెల 2వ తేదీన, 16న పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాయిలో ఆయా పరిధిలోని తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, తల్లుల కమిటీలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈనెల 30న స్థానిక ప్రజాప్రతినిధులతో, యువకుతల చేత సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల అవశ్యకతను వివరించి విద్యార్థుల నమోదుపై దృష్టిసారించాలని డీఈఓ వాసంతి హెచ్ఎంలను, ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు వివిధచోట్ల ఒకటో తరగతికి 728 మంది విద్యార్థులను గుర్తించారు. ఆరో తరగతికి 893 మందిని, ఎనిమిదో తరగతికి 287 మందిని గుర్తించారని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలియజేశారు.
జిల్లాలో కొనసాగతున్న ముందస్తు ‘బడిబాట’
ఇంటింటి ప్రచారం,
కరపత్రాల పంపిణీ
ఉపాధి పనుల వద్దకూ వెళ్లి
ప్రచారం చేస్తున్న టీచర్లు
ఇప్పటివరకు 1,908 మంది
విద్యార్థుల గుర్తింపు