
పారదర్శకంగా ధాన్యం సేకరించాలి
నర్సంపేట: పారదర్శకంగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, గన్నీ బ్యాగులు, తాగునీరు అందుబాటులో ఉంచాలని, ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా అవసరమైన హమాలీలను నియమించుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ధాన్యం నాణ్యత, రైతుల అవసరాలు, డబ్బు చెల్లింపులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి నీరజ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కార్యదర్శి జి.రెడ్డి, తహసీల్దార్ రాజేశ్ పాల్గొన్నారు.
లక్ష్య సాధనకు భగీరథుడు స్ఫూర్తి
వరంగల్: లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడు స్ఫూర్తి అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లో భగీరథ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై భగీరథుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దివి నుంచి నీటిని భువికి తెచ్చిన మహనీయుడు భగీరథుడి అని కొనియాడారు. ఆయనను స్మరించుకోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. వేడుకల్లో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, అధికారులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద

పారదర్శకంగా ధాన్యం సేకరించాలి