● దేవాదుల మూడో దశ మోటార్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
● ధర్మసాగర్ రిజర్వాయర్లోకి
600 క్యూసెక్కుల నీరు
● దేవన్నపేట పంప్హౌస్తో 5,22,522 ఎకరాలకు సాగు నీరు
● వరంగల్, కాజీపేట, హనుమకొండతో పాటు జనగామకు తాగునీరు
హసన్పర్తి/ధర్మసాగర్: దేవాదుల ప్రాజెక్ట్ మూడో దశలో భాగంగా దేవన్నపేట పంస్హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక మోటార్ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. 600 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి వదిలారు.
అరగంటపాటు నిరీక్షణ
వారం రోజుల క్రితం ధర్మసాగర్ చెరువులోకి నీటిని విడుదల చేయడానికి వచ్చిన మంత్రులు మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఆన్ కాకపోవడంతో తిరిగివెళ్లారు. రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో గేట్వాల్వ్లు పడిపోయాయి. ప్రత్యేక నిపుణులతో వాటికి మరమ్మతులు చేయించారు. రెండోసారి గురువారం సాయంత్రం మోటార్లు ఆన్ చేయడానికి వచ్చినా... మళ్లీ సాంకేతిక సమస్య కారణంగా అరగంట పాటు వెయిట్ చేశారు. టెక్నీషియన్లు సమస్య పరిష్కరించిన తర్వాత మంత్రులు లాంఛనంగా మోటార్ ఆన్ చేశారు.
పూజలు.. సన్మానాలు
మొదట దేవన్నపేటకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్ ప్రావీణ్య, నాయకులు పూలబొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. వారు తొలుత శిలాఫలకాన్ని సందర్శించారు. అనంతరం పంప్హౌస్ వద్దకు చేరుకోగా, వారికి ఇంజినీర్లు నీటిపంపింగ్ విధానాన్ని కంప్యూటర్లో చూపించారు. నీరు ఎక్కడినుంచి ఎలా వెళ్తుందో వివరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మూడో దశ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే నీరు రిజర్వాయర్లోకి వస్తుండగా పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. నీటిలోకి సారె వదిలారు. ఈసందర్భంగా మంత్రులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సన్మానించారు. అక్కడే మంత్రులు రెండు నిమిషాలు మాట్లాడి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, యశ్వసినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, నగర కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సింహారెడ్డి, ఈఎన్సీ అనిల్కుమార్, సీఈ అశోక్కుమార్, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాంనాయక్, డీఈఈ రాజు, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెండు భాగాలుగా నీటి పంపిణీ
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
దేవాదుల పంప్హౌస్ నుంచి వచ్చే నీటిని రెండు భాగాలుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ కేంద్రంగా ప్రారంభించిన దేవన్నపేట పంప్హౌజ్తో 5,22,522 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. స్టేషన్ ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 17,545 ఎకరాలకు ఉత్తర భాగం ప్రధాన కాలువ ద్వారా, అదే విధంగా దక్షిణభాగం కాలువ గుండా స్టేషన్ ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 1,58,948 ఎకరాలతోపాటు ధర్మసాగర్ తర్వాత బొమ్మకూరు, తపాసుపల్లి, గండిరామారం, అశ్వారావుపల్లి పరిధి 3,46,029 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడునగరాలతోపాటు జనగామ పట్టణానికి తాగునీరు అందించేందుకు దోహదపడుతుందన్నారు.
ఎట్టకేలకు నీటి విడుదల
ఎట్టకేలకు నీటి విడుదల
ఎట్టకేలకు నీటి విడుదల