వనపర్తి: ధాన్యం తరలింపులో జాప్యం సరికాదని.. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా లారీలను అందుబాటులో ఉంచి వేగంగా మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రవాణా కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, వీసీలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. రవాణా కాంట్రాక్టర్లు ప్రభు త్వ అవసరం మేరకు వాహనాలను సమాకూర్చాల్సిందేనని, అవసరమైతే సిమెంట్, ఇసుక తరలింపు లారీలను కూడా వినియోగించాలని సూచించారు. కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా వేగంగా తరలించాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లుల వద్ద ధాన్యం దించుకునే విషయంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు మాత్రమే తరలించాలని.. అలా కాదని ఇష్టం ఉన్నట్లు వ్యవహరించి అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ ఆంజనేయులు, డీటీఓ మానస పాల్గొన్నారు.


