తగ్గని ‘గృహజ్యోతి’ | - | Sakshi
Sakshi News home page

తగ్గని ‘గృహజ్యోతి’

May 16 2026 12:45 AM | Updated on May 16 2026 12:45 AM

పొదుపుగా వాడుతున్నారు..

జిల్లాలోని గృహజ్యోతి లబ్ధిదారులు వేసవిలోనూ విద్యుత్‌ను పొదుపుగా వాడుతున్నారు. కూలర్లు, ఏసీలు వాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో తీవ్రమైన వేసవిలోనూ గృహజ్యోతి లబ్ధిదారులు పెరుగుతున్నారు. మిగతా జిల్లాల్లో వేసవిలో విద్యుత్‌ వినియోగం పెరిగి గృహజ్యోతి లబ్ధిదారులు తగ్గినట్లు తెలిసింది. కానీ మన జిల్లాలో పొదుపు కారణంగా పెరుగుదల కొనసాగుతోంది.

– తిరుపతిరావు, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ

నెల లబ్ధిదారులు ప్రభుత్వం చెల్లించిన

నగదు (రూ.లక్షల్లో..)

జనవరి 84,204 189.77

ఫిబ్రవరి 84,399 203.00

మార్చి 84,567 217.23

ఏప్రిల్‌ 84,770 255.74

వనపర్తిటౌన్‌: వేసవిలో ఉక్కపోతతో అల్లాడుతున్నా.. జిల్లాలోని గృహజ్యోతి లబ్ధిదారులు మాత్రం పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,26,663 మంది గృహ విద్యుత్‌ వినియోగదారులు ఉండగా.. అందులో 84 వేల మంది పైచిలుకు 200 యూనిట్లలోపే విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఈ లబ్ధిదారుల సంఖ్య ప్రతినెల పెరుగుతూనే వస్తోంది. వేసవిలో ఎండలు తీవ్రరూపం దాల్చినా లబ్ధిదారుల సంఖ్య పెరగడం గమనార్హం. వేసవిలో నిరంతరాయంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వినియోగిస్తారు. ఈ క్రమంలో విద్యుత్‌ వినియోగం పెరిగి కొందరు లబ్ధిదారులకు కోత పడుతుందని అధికార యంత్రాంగం భావించింది. కానీ అందుకు విరుద్ధంగా ప్రతినెల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు టీజీఎస్‌పీడీసీఎల్‌కు ప్రతినెల ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే తెల్లరేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఏప్రిల్‌ నాటికి ప్రభుత్వం రూ.2.55 కోట్లకుపైగా విద్యుత్‌సంస్థకు చెల్లించింది. గృహజ్యోతి లబ్ధిదారులు ప్రతినెలా పెరుగుతుండగా.. పాత వినియోగదారులు సైతం 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

జిల్లాలో ఇలా..

చలికాలం అయిన జనవరిలో జిల్లావ్యాప్తంగా 84,204 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉండగా.. ప్రభుత్వం రూ.కోటి 89 లక్షల 77 వేలు విద్యుత్‌ సంస్థలకు బిల్లు చెల్లించింది. ఫిబ్రవరికి వచ్చేసరికి ఈ సంఖ్య 84,399కి చేరింది. అంటే ఒక్క నెలలోనే 195 మంది కొత్త లబ్ధిదారులు పెరగడంతో ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు చెల్లించే బిల్లు రూ.2.03 కోట్లకు చేరింది. మార్చి నెలలో 168 మంది లబ్ధిదారులు అధికం కావడంతో మొత్తం సంఖ్య 84,567 మందికి చేరగా.. రూ.2 కోట్ల 17 లక్షల 23 వేలకు చేరింది. ఏప్రిల్‌లో అత్యధికంగా 203 లబ్ధిదారులు పెరగగా జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 84,770కి చేరింది. ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన బిల్లు రూ.2 కోట్ల 55 లక్షల 74 వేలకు చేరింది. అంటే ఈ లెక్కన వేసవిలోనే గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్‌ సంస్థకు అధిక ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

వివరాలు 9లో..

జిల్లాలో లబ్ధిదారులు ఇలా..

జిల్లాలో ప్రతి నెల పెరుగుతున్న లబ్ధిదారులు

ప్రస్తుతం 84,770 మంది..

వేసవిలోనూ కనిపించని మార్పు

పొదుపుతోనే సాధ్యమైందంటున్న

అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement