రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం
● జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు
● తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు
● గద్వాల, ఆత్మకూర్ మధ్య తగ్గనున్న దూరం
కొనసాగుతున్న పిల్లర్ల పనులు
గద్వాల జిల్లా పరిధిలోని కొత్తపల్లి వైపు ముందుగా పిల్లర్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇదివరకే మూడు పిల్లర్ల పనులు చేపట్టాం. వరద నీరు వచ్చేలోగా కొత్తపల్లి వైపు నిర్మాణాలు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. జూరాల వైపు వరద వచ్చినా పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ, వనపర్తి
ఆనందంగా ఉంది..
గద్వాల మండలం కొత్తపల్లి సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నాం. ప్రస్తుతం మా గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లనాటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి, గద్వాల
మంత్రి కృషి ఫలితంతోనే..
ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు అడ్డంకులు సృష్టించినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్
ఆత్మకూర్కు మహర్దశ..
జూరాల గ్రామం వద్ద ఆ త్మకూర్, గద్వాలకు వా హనాలు తిరుగుతుంటే సంబురంగా ఉంది.వంతె నని ర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పనుల పూర్తికి ప ట్టుదలతో ముందుకెళ ్తున్న మంత్రి వాకిటి శ్రీహరికి రుణపడి ఉంటాం. ఆత్మకూర్ రూపురేఖలు మారడం ఖాయం.
– రహ్మతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల, ఆత్మకూర్ ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేడాది డిసెంబర్ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు.
వివాదాలు.. అడ్డంకులు...
హైలెవల్ వంతెన పనులను ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు భద్రతలో భాగంగా వంతెన నిర్మాణం డ్యాం వద్ద చేపట్టాలని ఎంపీ డీకే అరుణ పట్టుబట్టారు. ఇరిగేషన్శాఖ సమీక్షలో సైతం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డ్యాం వద్దనే వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించడంతో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఎంపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇరిగేషన్ నిధులతో డ్యాం సేఫ్టీ వంతెన నిర్మించాలని, ఆర్అండ్బీ నిధులతో కొత్తపల్లి–జూరాల వంతెన నిర్మించాలని, అభివృద్ధిని అడ్డుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 22 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక రహదారిపై ప్రయాణిస్తున్న రెండు జిల్లాల ప్రయాణికులు దూరభారం తగ్గడంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవే మీద ప్రయాణం చేయాల్సి ఉంది. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా తక్కువ వ్యవధిలో కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే వారికి దూరం తగ్గే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఆత్మకూర్, జూరాల, కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
తగ్గనున్న దూరం..


