వనపర్తిటౌన్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి బోధన అందిస్తున్నామని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (పీటీఎం) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందిస్తున్నామని.. అప్పులు చేసి తిప్పలు పడుతూ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని కోరారు. ప్రైవేట్కు ఏ మాత్రం తగ్గకుండా విద్యా అందుతుందని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాప్రెడ్డి, ప్లానింగ్ అధికారి శేఖర్, ఏఎంఓ మహానంది, జీహెచ్ఎంలు ఉమాదేవి, శివాజీ, సామాజికవేత్త గంధం నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


