పాన్గల్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామసభలను పండుగ వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధుల వివరాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామసభల్లో ప్రజలకు వివరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కరదీపికలను గ్రామసభలకు వచ్చే ప్రతి ఒక్కరికీ అందజేయాలని సూచించారు. గ్రామసభలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీటి వసతి కల్పించాలని, నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలస్థాయి అధికారులు గ్రామసభల నిర్వహణపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ గోవిందరావు, ఏపీఓ కుర్మయ్య, ఏపీఎం వెంకటేష్, ట్రాన్స్కో ఏఈ చందన్కుమార్రెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


