
కోయిల్సాగర్ @ రూ.84 లక్షలు
పాలమూరు జిల్లా వరప్రదాయిని కోయిల్సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 71 ఏళ్లు పూర్తయింది. 1947లో తెలంగాణ ప్రాంతానికి ఇంకా స్వాతంత్య్ర రాక ముందు ఆనాటి నైజాం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టుకు అప్పటి ఇంజినీర్లు రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించి 1954లో పూర్తిచేశారు. కేవలం రూ.84 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నుంచి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 లక్ష వ్యయంతో 6 అడుగుల మేర కట్టను బలోపేతం చేసి ఎత్తును పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. ఆనాటి ఎమ్మెల్యే వీరారెడ్డి కృషి ఫలితంగానే గేట్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. 2.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆయకట్టు కుడి కాలువ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్ల అంచనాతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి 2006లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్సాగర్కు తరలించేలా రూపకల్పన చేశారు.
కోయిల్సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి
పరుగులు పెడుతున్న నీరు (ఫైల్)
ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఏకై క ప్రాజెక్టు కోయిల్సాగర్. గతంలో చిన్ననీటి తరహా ప్రాజెక్టుగా ఉండగా ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత భారీ నీటి పారుదల శాఖ కిందకు మార్చారు. సాగునీటితోపాటు పాలమూరు పట్టణానికి తాగునీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నారాయణపేట జిల్లా, కొడంగల్ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్, ధన్వాడ మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు.
నైజాం ప్రభుత్వ హయాంలో 1947– 54 మధ్య నిర్మించిన కోయిల్సాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్సాగర్ అని పేరు పెట్టారు. రెండు గుట్టల మధ్య ప్రాజెక్టును పటిష్టంగా సున్నం, గచ్చు ఉపయోగించి నిర్మించారు. కట్టకు రెండు వైపులా రాతి గోడ నిర్మించి.. బయటి నుంచి మట్టితో నింపారు. ఇక అలుగును సైతం సున్నం గచ్చు ఉపయోగించి నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన పరికరాలు నేటికీ ప్రాజెక్టు సమీపంలోనే పడి ఉన్నాయి. ఇక ప్రాజెక్టు నమూనాను ముందుగా తయారు చేసి నిర్మాణం తర్వాత ప్రారంభించారు. ఆనాడు చేసిన నమూనా నేటికి ప్రాజెక్టు సమీపంలోనే కనిపిస్తుంది. ప్రాజెక్టును 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖార్జు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారంతోపాటు మరో రెండు చిన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే బాధితులకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది.
కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణం
పనులు (ఫైల్)
కట్టను నిర్మిస్తున్న ఆనాటి కూలీలు (ఫైల్)

కోయిల్సాగర్ @ రూ.84 లక్షలు