
దోస్త్.. లాస్ట్ చాన్స్
● డిగ్రీలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ పక్రియ
● నేడు, రేపు ప్రత్యేక చివరి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్
కల్వకుర్తి టౌన్: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరికకు చివరి అవకాశం కల్పించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను సోమవారం, మంగళవారం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి అవకాశంగా ఇచ్చిన స్పాట్ అడ్మిషన్ను ఉపయోగించుకోవాలని, ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆసక్తి గల కోర్సులలో చేరాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను నోటీస్ బోర్డులలో ఉంచగా.. ఏయే కోర్సులలో ఖాళీలు ఉన్నాయో దోస్త్ పోర్టల్లో వివరాలను పొందుపరిచారు.
నేరుగా రిపోర్టు..
దోస్త్ చివరి అవకాశంలో భాగంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్త్ పోర్టల్లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో కట్టిన రుసుంతో వచ్చి న రశీదును వారు ఎంచుకున్న కళాశాలలో చూయించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా భర్తీ కాని సీట్లకు ఈ నెల 18, 19వ తేదీలలో వన్టైం స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇదే తేదీలలో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ ప్ర క్రియలో పాల్గొనే అవకాశం ఉండదని ఉన్నత విద్యామండలి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఒరిజినల్ సర్టిఫికెట్లు తేవాలి
స్పాట్ అడ్మిషన్లో భాగంగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు వారి వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్, టీసీ, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, రెసిడెన్సీ, ఏదైనా బ్రిడ్జి కోర్సు చదివి ఉంటే, దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫారంతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సులలో సీట్లను భర్తీ చేయనున్నారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఆయా కళాశాలలో ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.