
జనాభా నియంత్రణతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి: జనాభా నియంత్రణతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం, కాన్పుల మధ్య ఎడం, తల్లి బిడ్డల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పాటించండి.. ఆరోగ్యంగా జీవించండి, కుటుంబ సంక్షేమం.. దేశ సౌభాగ్యం అనే నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాన్పునకు కాన్పునకు మధ్య ఎడమ ఉండాలని.. జనాభా నియంత్రణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలతో పాటు రక్తహీనత, గర్భస్రావం సంభవించే ప్రమాదం ఉందని వివరించారు. ప్రతి కుటుంబం ఒక్కరు లేదా ఇద్దరు సంతానంతో ఆరోగ్యవంత సమాజం ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్న కుటుంబంతో కలిగే ప్రయోజనాలు, తల్లి బిడ్డ ఆరోగ్యం వంటి అంశాలపై జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. బండారి శ్రీనివాసులు, వైద్యాధికారులు, నర్సింగ్ విద్యార్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.