
ట్రిపుల్ ఐటీ సొబగులు
ఎడ్యుకేషన్ హబ్గా మారనున్న మహబూబ్నగర్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/జడ్చర్ల/జడ్చర్ల టౌన్: పాలమూరు జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారుతోంది. ఇప్పటికే పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేయగా.. తాజాగా ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ) బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు అనుబంధంగా మహబూబ్నగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరైంది. ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కళాశాల పూర్తిస్థాయి క్యాంపస్ ఏర్పాటు కోసం దివిటిపల్లి వద్ద స్థల పరిశీలన సైతం అధికారులు పూర్తి చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్ చాన్స్లర్ గోవర్ధన్ స్థల పరిశీలనలో పాల్గొని.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
మూడు కోర్సులతో ప్రారంభం
ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ పూర్తిస్థాయిలో నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతోంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు తాత్కాలిక భవనం ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బండమీదిపల్లి వద్ద ఉన్న పాత రెడ్డి హాస్టల్ భవనంలో తరగతులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు కోర్సులతో కళాశాల ప్రారంభించనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరంలో ఒక్కో కోర్సులో 60 మంది చొప్పున 180 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించనున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
41.32 ఎకరాల్లో క్యాంపస్
జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ కోసం జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి శివారులోని సర్వే నంబర్ 1లో 21.26 ఎకరాలు, మహబూబ్నగర్ అర్బన్ మండలం పరిధిలోని 20.06 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ ఏర్పాటుతో జడ్చర్ల రూపురేఖలు మారనున్నాయి. జాతీయ రహదారికి ముఖద్వారంలా ఉన్న జడ్చర్ల మరింత అభివృద్ధి సాధించే అస్కారం ఉంది. జడ్చర్ల, మహబూబ్నగర్ శివార్లలోని జాతీయ రహదారి పక్కన కళాశాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం చిట్టెబోయిన్పల్లి శివారు సర్వే నంబర్ 1లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నవాబుపేట మండలానికి తరలించనున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురుకుల పాఠశాలను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్థులకు విద్యనందిస్తూ వచ్చింది. అయితే ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు కావడంతో.. గురుకుల పాఠశాల వేరే ప్రాంతానికి తరలించడం అనివార్యమైంది. నవాబుపేట మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు
ఈ విద్యా సంవత్సరం మూడు కోర్సులతో ప్రారంభం
ప్రస్తుతానికి పాత రెడ్డి హాస్టల్
భవనంలో ఏర్పాటుకు కసరత్తు
క్యాంపస్ నిర్మాణానికి జడ్చర్ల, మహబూబ్నగర్ శివార్లలో 41.32
ఎకరాల స్థలం కేటాయింపు

ట్రిపుల్ ఐటీ సొబగులు

ట్రిపుల్ ఐటీ సొబగులు