
బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం
వనపర్తి: బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ పని చేస్తోందని సంఘం రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ జనభేరి మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమకాంక్ష ఒక్కరోజులో సఫలీకృతం కాదని.. దీర్ఘకాలం పోరాడాలని, ఈ సమయంలో ఏళ్లుగా రాజ్యాధికారం అనుభవిస్తున్న వారు హేళన చేసినా, తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా బెదిరేది లేదన్నారు. ఓ వైపు బీసీల హక్కుల కోసం పోరాడుతూనే ఈ ప్రాంత బిడ్డగా సమాజంలో చోటు చేసుకుంటున్న అవినీతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధుల అలసత్వాన్ని ఎండగట్టేందుకు మరో అడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. ఓర్వలేని కొందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుదిరగనని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని.. లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ తమ అభ్యర్థులను నిలబెట్టి ప్రజల ఆశీర్వాదంతో గెలిపించుకునేందుకు వెనుకాడబోదన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావడంతో మైదానం జనకళను సంతరించుకుంది. బుల్లితెర కళాకారులు జానులిరి, జంగిరెడ్డి బృందం తమ ప్రదర్శనలతో అలరించారు.