
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
వనపర్తి విద్యావిభాగం/అమరచింత: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని రాష్ట్ర తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రానికి బడిబాట ప్రచార జాత చేరుకోగా యూటీఎఫ్ నాయకులు, సభ్యులు పెద్దఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. రాజీవ్ చౌక్, అంబేడ్కర్ చౌక్లో, సాయంత్రం అమరచింతలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు సంఖ్య పెంపునకు టీఎస్ యూటీఎఫ్తో పాటు తెలంగాణ పౌర స్పందన వేదిక కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు ఉన్నాయని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాంలు అందించడంతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం నుంచి విముక్తి పొందాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని, సంపాదనలో సగానికిపైగా చదువులకే ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్లతో పాటు ఒత్తిడి లేని బోధన అందుతుందని వివరించారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రవిప్రసాద్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి జిల్లా కార్యదర్శులు హమీద్, శ్రీనివాస్గౌడ్, తిమ్మప్ప, అరుణ, అనసూయ, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు భద్రశేనయ్య, రామన్గౌడ్, నారాయణ, గట్టయ్య, భీమయ్య, అమరచింతలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏఈ మంగ, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, కావ్య, ధనమూర్తి, అగ్రిప్ప, రాములు, కిరణ్, జీఎస్ గోపి, అజయ్, తౌఫిక్, అశోక్, రవి, ఎం.శ్రీనివాసులు, ఆదాం తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి