
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
వనపర్తి విద్యావిభాగం: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కలర్చన అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భావం, సంస్థ అందించే ప్రయోజనాలను వివరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం 2012, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకుగాను పోష్ యాక్ట్ 2013, డ్రగ్స్, మత్తు పదార్థాలు తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ నెల 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సాయం పొందాలని, మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్రెడ్డి, సైన్స్ ఉపాధ్యాయుడు జి.సుదర్శన్రావు, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, సురేష్, దయాకర్, వెంకటేష్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.