స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

May 31 2025 12:17 AM | Updated on May 31 2025 12:17 AM

స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

వనపర్తి: వివిధ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు (కొత్త, పాత) 2024–2025 విద్యా సంవత్సరంలో స్కాలర్‌షిప్‌ పొందేందుకు పూర్తి వివరాలను ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ http://telanganae pass.gov.inలో నమోదుకుగాను జూన్‌ 30 వరకు గడువు ఉందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి ఎం.మల్లికార్జున్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తి: బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 1, 5వ తరగతిలో ప్రవేశాలకు జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జిల్లాకు చెంది, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించని వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు దిగువ చూపిన ధ్రువపత్రాలు జతచేసి జూన్‌ 16లోగా కార్యాలయంలో సమర్పించాలన్నారు. కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలకు కులం, ఆదాయం, స్థానిక, జనన ద్రువపత్రాలతో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు ప్రతులపై గజిటెడ్‌ అధికారి సంతకం చేయించి సమర్పించాలన్నారు. అలాగే 5వ తరగతిలో ప్రవేశాలకు కులం, ఆదాయం, స్థానిక, 4వ తరగతి పాసైన బోనఫైడ్‌ (ఒరిజినల్‌), ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ప్రతులపై గజిటెడ్‌ అధికారి సంతకం చేయించి సమర్పించాలని పేర్కొన్నారు. వివరాల కోసం జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారిని సంప్రదించాలని సూచించారు.

మక్తల్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

షాద్‌నగర్‌రూరల్‌: నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్‌నగర్‌వైపు వెళ్తున్న మరో కారు టోల్‌ప్లాజాలోని వేరే లైన్‌కు మారేందుకు డ్రైవర్‌ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్‌ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement