
ఇసుక రీచ్లను గుర్తించండి
వనపర్తి: మన ఇసుక వాహనం ద్వారా భవన నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేందుకు రీచ్లను గుర్తించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాస్థాయి సాండ్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో కొత్తగా ఎక్కడెక్కడ రీచ్లు గుర్తించారు, వాటి భౌగోళిక పరిస్థితులపై చర్చించారు. తుంపల్లి, వీరరాఘవాపూర్ రీచ్లలో 3,990 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని, ఇరిగేషన్, భూగర్భ జలాలు, మైన్స్ అండ్ జియాలజి రిపోర్టును కలెక్టర్కు అందజేశారు. వీరరాఘవపూర్ రీచ్ నుంచి ఇసుక తరలింపునకు కమిటీ తీర్మానం చేసింది.
రహదారి విస్తరణ పనుల్లో జాప్యం సరికాదు..
జిల్లాలో రహదారి విస్తరణ పనుల్లో చాలా జాప్యం జరుగుతుందని.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ను ఆదేశించారు. బాధితులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లు తీసుకోవడంతో భవిష్యత్లో నాలుగింతల లాభం చేకూరుతుందని.. అవగాహన కల్పించాలని సూచించారు. రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులతో సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రోడ్లు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
వరి కొనుగోళ్లపై ప్రత్యేక బులెటిన్..
యాసంగిలో ఇప్పటి వరకు 2,30,796 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి వివరించారు. గురువారం ఒక్కరోజే మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించినట్లు చెప్పారు. ధాన్యం తరలింపునకు 180 లారీలు వినియోగించామని, 135 లారీల ధాన్యం మిల్లుల్లో ఖాళీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.445 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.