
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
వనపర్తి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు జరుగుతాయని.. అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వేదిక, అతిథులు, ప్రజాప్రతినిధులు, వేడుకలకు హాజరయ్యే ప్రజలు కూర్చునేందుకు వసతులను రోడ్లు, భవనాలశాఖ చేపట్టాలని సూచించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
2,37,500 మెట్రిక్ టన్నుల ధాన్యం
కొనుగోలు..
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుపై శుక్రవారం కలెక్టర్ ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. యాసంగిలో ఇప్పటి వరకు 2,37,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే 6,744 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించామని, ఇందుకుగాను 170 లారీలు వినియోగించగా.. 160 లారీల్లోని ధాన్యం మిల్లులో అన్లోడ్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.456 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.