
‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత
రాష్ట్రస్థాయిలో పడిపోయిన జిల్లా స్థానం
వనపర్తిటౌన్/విద్యావిభాగం: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడగా.. జిల్లాకు రాష్ట్రస్థాయిలో 29వ స్థానం దక్కింది. ఉత్తీర్ణత మాత్రం గతేడాది కంటే 2.3 శాతం మెరుగుపడింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 27వ స్థానం.. ఉత్తీర్ణత శాతం 86.9 శాతం ఉండగా.. ఈసారి 29వ స్థానానికి చేరడం నిరాశే మిగిల్చింది. కాగా ఉత్తీర్ణత శాతం మాత్రం 89.21కు చేరడం కొంత ఊరట కలిగించే విషయం. జిల్లావ్యాప్తంగా 6,842 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 6,104 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 738 మంది ఫెయిలయ్యారు. 3,415 మంది బాలురు పరీక్షలు రాయగా.. 2,982 మంది ఉత్తీర్ణత సాధించగా 87.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 3,427 మంది బాలికలకుగాను 3,122 మంది ఉత్తీర్ణులు కాగా.. 90.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పది ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు.
30 పాఠశాలల్లో 100 శాతం..
జిల్లాలోని చిన్నంబావి. ఖిల్లాఘనపురం, రేవల్లి, శ్రీరంగాపూర్, వీపనగండ్ల కేజీబీవీలతో పాటు 25 జెడ్పీ ఉన్నత పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
పదోతరగతి ఫలితాల్లో 2.3 శాతం పెరుగుదల
గతేడాది ఉత్తీర్ణత శాతం 86.9.. ర్యాంకు 27
ఈ ఏడాది 89.2 శాతం ఉత్తీర్ణత.. 29వ ర్యాంకు
బాలికలదే పైచేయి

‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత