వనపర్తి క్రైం: పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రక్షిత కె.మూర్తి కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో వర్టికల్ ఇన్చార్జ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఠాణాలకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారికి సేవలందించడంలో రిసెప్షన్ అధికారి పాత్ర కీలకమైందని తెలిపారు. ఫంక్షన్ వర్టికల్స్ పకడ్బందీగా అమలుచేయాలని కోరారు. సమావేశంలో ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, సీఐలు శ్రీనివాస్రెడ్డి, రత్నం, డీసీఆర్బీ ఎస్ఐ వెంకటేష్, అన్ని ఠాణాల ఎస్ఐలు పాల్గొన్నారు.
16న ప్రవేశ పరీక్ష
వనపర్తిటౌన్: జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 16న కొత్తకోట, పెబ్బేర్, ఖిల్లా ఘణపురంలోని పాఠశాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు విధిగా మాస్క్ ధరించి, శానిటైజర్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
దరఖాస్తుల
ఆహ్వానం
వనపర్తి క్రైం: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిభిరాల నిర్వహణకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రహమాన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు క్రీడా శిక్షణ శిభిరాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సీనియర్ క్రీడాకారులైతే కనీసం జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలని.. దరఖాస్తుతో పాటు సంబంధిత క్రీడపత్రాలు జతచేసి జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో ఈ నెల 21లోగా అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు రవీందర్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ (సెల్నంబర్ 94407 88502) సంప్రదించాలని సూచించారు.
దళారులను నమ్మొద్దు
గోపాల్పేట: దళారుల మాటలు నమ్మకుండా.. ప్రభుత్వం కేటాయించిన ఖాతాలో డబ్బులు జమ చేయాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. రెండోవిడత గొర్రెల పంపిణీలో భాగంగా గురువారం మండల కేంద్రంతో పాటు రేవల్లిలో లబ్ధిదారులకు తమ వాటా చెల్లించే డబ్బుల విషయమై అవగాహన కల్పించారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రత్యేక వర్చువల్ ఐడీ అకౌంట్ ఉంటుందని.. సొంత ఖాతా నుంచి నెఫ్ట్ ద్వారా రూ.43,750 బదిలీ చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


