విజయనగరం ఫోర్ట్: రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం.. వారికి అన్ని విధాలా అండగా ఉంటున్నాం.. అంటూ చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. కాని వాస్తవ పరిస్థితి అందుకువిరుద్ధంగా ఉంది. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో టీడీపీ సర్కార్ అలసత్వం వహిస్తోందనే ఆరోపణులు బలంగా వినిపిస్తున్నాయి. పంట నష్టం జరిగి నెలలు గడుస్తున్నా వారికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా పాలకులు మోసం చేస్తున్నారు. కష్టం వచ్చిన వెంటనే సాయం అందిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ నష్టం జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
776 హెక్టార్లలో పంటలకు నష్టం..
గతేడాది వచ్చిన మోంథా తుఫాన్ కారణంగా జిల్లాలో వందల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, చెరకు, ఉలవ, పత్తి, శనగ, మినుము పంటలకు సంబంధించి 776.978 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. ఇందుకుగాను రూ.1.93 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి పంపించినా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. గతేడాది అక్టోబర్ నెలలో మోంథా తుఫాన్ సంభవించింది. పంటలు కోల్పోయి ఏడు నెలలవుతున్నా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే పంటలకు నష్టం జరిగిన నెల రోజుల్లోపే రైతులకు పరిహారం అందేది.
చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వివరాలు..
పంట నష్టం జరిగితే పెసర పంటకు (హెక్టారుకు) రూ. 15 వేలు చెల్లించాలి. అదేవిధంగా చెరకు పంటకు రూ. 25 వేలు, ఉలవకు రూ. 15 వేలు, మొక్కజొన్నకు రూ.15 వేలు, వరికి రూ. 25 వేలు, శనగకు రూ.15 వేలు, పత్తికి రూ. 15 వేలు, మినుము పంటకు రూ. 15 వేలు అందించాల్సి ఉంది.
నిధులు మంజూరు కాలేదు..
మోంథా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి రూ. 1.93 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపించాం. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా మంజూరు కాలేదు. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.
– వి. తారకరామారావు, వ్యవసాయ శాఖ ఎ.డి
గతేడాది మోంథా తుఫాన్కు 776 హెక్టార్లలో పంటలకు నష్టం
ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ
ఇవ్వని వైనం
వరి, మొక్కజొన్న పత్తి, పెసర
పంటలకు నష్టం


