జిల్లాకు జ్వరమొచ్చింది..!
జ్వరాల నియంత్రణకు చర్యలు
గ్రామాల్లో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా మలేరియా, డెంగీ పరీక్షలు చేయిస్తున్నాం. ఆస్పత్రుల్లో చికిత్స అవసరమైన వారిని రిఫర్ చేస్తున్నాం. రెండు, మూడు రోజులు జ్వరం తగ్గకపోతే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల జ్వరాలకు చికిత్స అందుబాటులో ఉంది.
– డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన డి.రమణ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఇన్పేషేంట్గా చేర్చుకుని చికిత్స అందించారు. ఆరురోజుల పాటు చికిత్స అందించి రూ.60 వేలు బిల్లు వేశారు.
● ఇదే మండలానికి చెందిన ఎస్.కృష్ణకు జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా వైరల్ ఫీవర్ అని నిర్ధారణ అయింది. ప్లేట్లెట్స్ 24 కు తగ్గిపోయాయి. దీంతో వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
● విజయనగరం పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కి జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా అని నిర్ధారణ అయింది. ఇలా వీరే కాదు. అనేక మందిజ్వరాల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్స్తో పాటు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్న జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటాలాడుతున్నాయి.
గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు
మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో మలేరియా కేసులు గిరిజన ప్రాంతంలో ఎక్కువగా నమోదయ్యేవి. కానీ ఇప్పడు మైదాన ప్రాంతాల్లోనూ అధికంగా నమోదువుతున్నాయి. జిల్లాలో గిరిజన ప్రాంతం తక్కువగా ఉన్నప్పటికీ కేసులు అధికంగా నమాదవుతుండడం గమనార్హం. అక్టోబర్ 12వతేదీ నాటికి జిల్లాలో 338 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా డెంగీ కేసులు 65 నమోదయ్యాయి. వైరల్ ఫీవర్స్ 2,91,572 కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్ కేసులు 650 వరకు నమోదయ్యాయి. అయితే వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జ్వరపీడితులు వివరాలు ఇవి. జిల్లాలో 50 పీహెచ్సీలు, 8 సీహెచ్సీలు, 18 పట్టణ పీహెచ్సీలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు జిల్లాలో 300వరకు ఉన్నాయి. వాటిలో వైరల్ ఫీవర్ కేసులు 2 లక్షలు వరకు నమోదయ్యాయి.
తగ్గిపోతున్న ప్లేట్లెట్స్
జ్వరపీడితులకు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి. గతంతో డెంగీ, మలేరియా కేసులకు ప్లేట్లెట్స్ తగ్గిపోయేవి. కానీ ప్రస్తుతం సాధారణ వైరల్ ఫీవర్కు కూడా ప్లేట్లెట్స్ తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. దీంతో జ్వరం వచ్చిందంటే చాలు హడలిపోతున్నారు.ప్లేట్లెట్స్ కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి.
అధిక మొత్తంలో ఫీజుల వసూలు
జ్వర పీడితులకు ప్రైవేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జ్వరం వచ్చిందంటే చాలు జేబు గుల్ల చేసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలేరియా, డెంగీ కేసులకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. టైఫాయిడ్ కేసులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలేరియా, డెంగీ కేసులకు ఆరోగ్యశ్రీ వర్తించేది. అయితే కొద్ది రోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచి పోవడంతో రోగులు డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి.
పెరుగుతున్న మలేరియా,
డెంగీ కేసులు
వైరల్ జ్వరాలు 2,91,572 నమోదు
బాధితులకు పడిపోతున్న ప్లేట్లెట్స్
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక మొత్తంలో ఫీజుల వసూలు
జిల్లాకు జ్వరమొచ్చింది..!


