
పైడితల్లి ఆలయంలో సమస్యల కొలువు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 12 నుంచి పందిరిరాట, మండల దీక్షలతో ప్రారంభంకానున్నాయి. చదురుగుడి అభివృద్ధి కోసం ఇరువైపులా ఉన్న షాపులను పూర్తిగా నేలమట్టం చేయడంతో కొన్నాళ్లుగా ఆలయ గోడలు శిథిలావస్థకు చేరాయి. వర్షం కురిస్తే ఆలయమంతా నీటితో నిండిపోతోంది. అసలే చిన్న ఆలయం కావడంతో పక్కన రేకులను కప్పి మమ అనిపించేశారు. వర్షం కురిసినప్పుడు ప్రధాన ఆలయం లోపలికి వర్షం నీరు చేరుతుండడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న ఆలయానికి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో అధికారులున్నారా ? అని ప్రశ్నిస్తున్నారు. హుండీల ఆదాయం నెల, నెలన్నర రోజులకు లెక్కిస్తారు. గత గురువారం లెక్కించిన చదురుగుడి హుండీల నుంచి రూ.15,62,461 నగదు, సుమారు 12 గ్రాముల బంగారం, 216 గ్రాముల వెండి లభించాయి. వనంగుడి నుంచి రూ.3,64,000 ఆదాయం సమకూరింది. లక్షలాది రూపాయలు ఆదాయం వస్తున్నా చిన్నపాటి వర్షం వస్తే కారిపోయే ఆలయానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోవడంపై భక్తులు విచారం వ్యక్తంచేస్తున్నారు. పండగ పూట వర్షం కురిస్తే కారిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
● రక్షణ కరువు
పైడితల్లి అమ్మవారి చదురుగుడి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆలయంలో సుమారు ఐదారు హుండీల వరకు ఉంటాయి. భక్తులు సమర్పించే కానుకలన్నీ అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. ఆలయానికి పటిష్టమైన భద్రత లేకపోవడం వల్ల ఎప్పుడు ఏ చోరీ జరుగుతుందోనన్న భయం అటు సిబ్బంది, ఇటు భక్తుల్లో నెలకొంది. పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆలయ అభివృద్ధికి
నిధులు మంజూరయ్యాయి
పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. పైడితల్లి జాతర మహోత్సవాలు పూర్తికాగానే ఆలయ విస్తరణ పనులు ప్రారంభిస్తాం, ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ–టెండర్లు పిలిచారు. నాలుగు టెండర్లు వచ్చాయి. ఈలోపు తాత్కాలికంగా మరమ్మతులు చేపడతాం.
– కె.శిరీష, ఇన్చార్జి ఈఓ,
పైడితల్లి అమ్మవారి దేవస్థానం, విజయనగరం
హుండీలకు రక్షణ అంతంత మాత్రమే..
వర్షం కురిస్తే ఆలయమంతా నీరే..
శిథిలావస్థలో ఆలయ ప్రహరీలు
పండగ సమీపిస్తున్నా మరమ్మతుల పనులు శూన్యం

పైడితల్లి ఆలయంలో సమస్యల కొలువు

పైడితల్లి ఆలయంలో సమస్యల కొలువు