విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు రాజీవ్ క్రీడా మైదానంలో జరుగనున్నాయని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను జిల్లా క్రీడాధికారి ఎల్. వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్లతో కలిసి స్థానిక అశోక్బంగ్లాలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టులో 14వ జాతీయస్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ –2025 పోటీలు జరుగనున్నాయని, ఈ పోటీలకు అర్హత సాధించేందుకు ముందుగా జిల్లా స్థాయిలో ఎంపిక కావాల్సి ఉందన్నారు. 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు దివ్యాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఆగస్టు 9న విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రధానంగా రన్నింగ్, షాట్పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నారని, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగ (పారా) క్రీడాకారులంతా ఈ పోటిల్లో పాల్గొని ప్రతిభ చాటాలని కోరారు. క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకునేందుకు ఫోన్ 9849377577 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రదీప్, పారా క్రీడాకారులు పాల్గొన్నారు.