
‘జిందాల్’కు నీరిస్తే రైతులకు నష్టం
విజయనగరం ఫోర్ట్: జిందాల్ పరిశ్రమలకు బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నుంచి నీరు ఇస్తే రైతులు నష్ట పోతారని ఆయకట్టు పరిరక్షణ కమిటి సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిందాల్ భూముల్లో పెట్టనున్న చిన్న పరిశ్రమల పార్కుకు బుచ్చి అప్పారావు జలాశయం నుంచి నీరు ఇచ్చేందుకు విడుదల చేసిన జీఓ 14ను రద్దు చేయాలన్నారు. జలాశయం కింద ఉన్న శివారు కాలువలకు సిమెంట్ లైనింగ్, తూములు, షట్టర్ల ఏర్పాటుతో పాటు రాకపోకలకు వీలుగా వంతెనలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్ట్ మెయింటినెన్స్కు ఇచ్చే సాధారణ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ధర్నాలో జామి మండల జెడ్పీటీసీ మాజీ సభ్యులు గొర్లె రవికుమార్, బండారు పెదబాబు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి. రాంబాబు, గులిపల్లి జయపాల్, కొత్తలి ఎర్నాయుడు, కోడెల ముత్యాలనాయుడు, కోడెల శ్రీను, బండారు సూర్యారావు, జాగారపు అప్పారావు, కిలపర్తి శ్రీరామ్మూర్తి, గనివాడ సన్యాసినాయుడు, తమటపు పైడినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బుచ్చి అప్పారావు జలాశయం
ఆయకట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు