
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 248 మంది ఎంపిక
విజయనగరం అర్బన్: పదోతరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు జిల్లా నుంచి 248 మంది (6.14 శాతం) ఎంపికయ్యారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలకు 68 మంది, ఆర్కేవేలీ ట్రిపుల్ ఐటీకు 24 మంది, ఒంగోలు ట్రిపుల్ ఐటీకు 34 మంది, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కళాశాలకు 122 మంది ఎంపికై నట్టు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఒకే పాఠశాల నుంచి 16 మంది ఎంపిక
బొబ్బిలి: మండలంలోని కోమటిపల్లి (కారాడ) మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)కి ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ గుణుపూరు పురుషోది సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఆరుగురు, శ్రీకాకుళం– ఐదుగురు, ఒంగోలు– నలుగురు, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీకి ఒకరు ఎంపికై నట్టు చెప్పారు. ఒకే సారి 16 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు.
భోజన పథక బిల్లులను చెల్లించాలి
● డీఈఓకు మధ్యాహ్న భోజన పథక కమిటీ వినతి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం బిల్లుల బకాయిలను తక్షణమే చెల్లించాలని భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్రవంతి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం డీఈఓ యు.మాణిక్యంనాయుడుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగునెలలుగా మెస్ బిల్లు లు, గౌరవ వేతనాలు ఇవ్వక పోవడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే జూలై 1 నుంచి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. భోజన పథక కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల న్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఉంగరాల విజయలక్ష్మి, కార్యదర్శి పి.లక్ష్మి, రాజీ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సర్వేయర్ల నిరసన
డెంకాడ: సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ సర్వేయర్లు డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బంది 4,722 మంది సర్వేయర్ల భవిష్యత్పై సమగ్ర నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2కి మార్చినందున పే స్కేల్లో తగిన మార్పులు చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలు పబ్లిష్ చేయాలన్నారు. అర్హులందరికీ ఉద్యోగోన్నతి కల్పించేలా సర్వీస్ రూల్స్లో తగిన మార్పులు చేయాలని, ఇప్పటివరకు జరిగిన రీ సర్వే పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ప్రసాద్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 248 మంది ఎంపిక