
కూటమిది వెన్నుపోటు పాలన
ప్రభుత్వ తీరుపై ప్లకార్డులతో నిరసన
విజయనగరంలో నిర్వహించిన యువతపోరు ర్యాలీలో పాల్గొన్న వెఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు
విజయనగరం:
కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనపై యువత, నిరుద్యోగులు గర్జించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయనగరంలో సోమ వారం పోరుబాట సాగించారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ విడుదలలో జాప్యంపై నిరసన గళం వినిపించారు. దగా చేసిన పాలకుల వైఖరిని నిరసిస్తూ.. తమకు కావాల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర అంటూ నినదించారు. అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన రూ.3 వేల భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడాన్ని ఖండించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ‘యువత పోరు’ పేరిట వందలాది మంది యువత, నిరుద్యోగులు, విద్యార్థులు కలిసి జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. బాబు వచ్చాడు.. జాబు పోయింది.. నిరుద్యో భృతి ఎప్పుడు?.. తొలగించిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి... కల్లబొల్లి మాటలొద్దు ఉద్యోగాలు ఇవ్వండి.. వసతి దీవెన డబ్బులు ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు న్యాయం చేయాలని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు.
చిరుద్యోగుల తొలగింపు అన్యాయం
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, చిరుద్యోగులను రాజకీయ కక్షతో తొలగిస్తుండడం అన్యాయమని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్ కౌశిక్ అన్నారు. వలంటీర్ వ్యవస్థ రద్దుతో 2.66 లక్షల మందికి ఉపాధి పోయిందని, వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయని వాపోయారు. ఇస్తానన్న రూ.10వేలు జీతం ఇవ్వక, ఉన్న ఉద్యోగాన్ని పీకేయడం ఎంత వరకు సమంజసమని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లలో పనిచేసిన 18 వేలమంది రోడ్డున పడ్డారని, వైద్యఆరోగ్యశాఖలో స్పెషలిస్ట్ వైద్యుల నియామకం ఆపేశారన్నారు. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో 20 వేల కుటుంబాల ఉపాధికి గండిపడిందన్నారు. పశు సంవర్థక శాఖలో చిరుద్యోగులనూ తొలగించేందుకు ఉపక్రమిస్తుండడం విచారకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల కుపైగా ఉద్యోగాలను తొలగించారని, వారందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సోషల్ మీడియా అధ్యక్షుడు వాసునాయుడు, పార్టీ జామి మండలాధ్యక్షుడు గొర్లె రవి, ఎస్.కోట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వాకాడ సతీష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఫణి, కార్పొరేటర్లు జి.వి.రంగారావు, పట్నాన పైడిరాజు, ఎన్ని లక్ష్మణరావు, పార్టీ నాయకులు బోడసింగి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనలో విద్యార్థిలోకం
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేయడంపై ఆగ్రహం
జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ
ప్రశ్నల వర్షం
కూటమి పాలనకు వ్యతిరేకంగా
యువత నిరసన గళం
జోరువానలో సాగిన నిరసన హోరు
జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి
కలెక్టర్ వరకు సాగిన ర్యాలీ
డీఆర్వోకు వినతిపత్రం అందజేత
ఎన్నికలకు ముందు ఓట్లు దండుకునేందుకు నిరుద్యోగ యువతకు హామీలిచ్చి.. నేడు అమలుచేయకపోవడం కూటమి ప్రభుత్వ వెన్ను పోటు పాలనకు నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్ అన్నారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీలను తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల తొలగింపును వెంటనే ఆపాలన్నారు. ఇప్పటికే తొలగించినవారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసకారి పాలనతో రాష్ట్రంలో యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన అందక, చదువుకునే లక్షలాదిమంది యువత తీవ్రకష్టాలు పడుతుంటే ప్రభుత్వం వేడుక చూస్తుందా అంటూ ప్రశ్నించారు. పేదకుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులు సాకారం కావాలన్న సమున్నత లక్ష్యంతో గత జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు నిధులు మంజూరు నిలిపివేయడం దారుణమన్నారు. దీనివల్ల యువకుల తల్లిదండ్రులు అధికవడ్డీలకు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సుందర హరీష్, చీపురుపల్లి యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీలు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థిలోకం ఆందోళన చెందుతోందన్నారు. తక్షణమే 2024–25 విద్యాసంవత్సరానికి ఫీజురీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింట్నెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం 5.3,900 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతమైన లక్ష్యంతో జిల్లాకు గత ప్రభుత్వం మంజూరుచేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసే యత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కూటమిది వెన్నుపోటు పాలన

కూటమిది వెన్నుపోటు పాలన

కూటమిది వెన్నుపోటు పాలన